March 15, 2024
రజాకార్ల దాడి నేపథ్యంలో యాటా సత్యనారాయణ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా రజాకార్. గూడూరు నారాయణరెడ్డి నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా మార్చ్ 15న విడుదల అయింది. అయితే ఈ సినిమా ఎలా ఉందో ఓసారి చూసేద్దాం.
కధ: భారతదేశానికి 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వస్తుంది కానీ హైదరాబాద్ సంస్థానానికి మాత్రం 1948 సెప్టెంబర్ 17 వరకు స్వతంత్రం రాలేదు. ఈ లోపు అతిపెద్ద సంస్థానమైన హైదరాబాద్ ని భారత్ లో విలీనం చేయటానికి ఇష్టపడని మీర్ ఉస్మాన్ ( మకరంద్ పాండే) హైదరాబాద్ సంస్థానాన్ని తుర్కిస్తాన్ గా మార్చి ఒక ప్రత్యేక దేశంగా ప్రకటించి పాలించుకోవాలని భావిస్తాడు.
అందుకు ప్రజలందరినీ ఒకే మతానికి చెందిన వారిగా మార్చాలని ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తాడు.మతమార్పిడి కోసం రజాకార్ల వ్యవస్థను ఉపయోగించుకుంటాడు. అలాగే సిస్తు కట్టలేని వాళ్ళని కొట్టి చంపుతూ ఉంటాడు. ఈ క్రమంలో ఐలమ్మ ( ఇంద్రజ) గూడూరు నారాయణ, రాజిరెడ్డి ( బాబీ సింహా ) రజాకారులతో పోరాడి వీరమరణం చెందుతారు.
ఇవన్నీ చూస్తున్న హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ ని భారతలో విలీనం చేయాలని భావిస్తే ప్రధానమంత్రి నెహ్రూ అందుకు ఒప్పుకోడు. అయితే వల్లభాయ్ పటేల్ ఈ సమస్యని ఎలా పరిష్కరించాడు? చివరికి నిజాం రాజు స్వయంగా వచ్చి హైదరాబాద్ ని భారత్ లో విలీనం చేస్తున్నానని ప్రకటించేలా చేసింది ఎవరు అనేది సినిమా కథ.
కథ ఎలా ఉందంటే: ఈ సినిమాని అద్భుతమైన చిత్రం అని చెప్పవచ్చు. కాశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ తరహాలో కంటతడి పెట్టించేలాగా సినిమాని తీర్చిదిద్దాడు దర్శకుడు. స్క్రీన్ ప్లే కూడా బలంగా రాసుకున్నాడు. తెలంగాణ సాయుధ పోరాటంలోని ముఖ్యమైన ఘటనలను టచ్ చేస్తూ కథనాన్ని నడిపించాడు. సినిమా ముగిసిన తరువాత తెలంగాణ సాయుధ పోరాట యోధుల్ని గుర్తు చేస్తూ వచ్చే పాట ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.
నటీనటులు: రాజా రెడ్డిగా బాబీ సింహ,ఐలమ్మగా ఇంద్రజ పూర్తిగా పాత్రలలో ఇమిడిపోయారు. ఖాసిం రజ్వీ పాత్రలో రామ్ అర్జున్ ఒదిగిపోయాడు. సినిమాలో అతని పాత్ర హైలెట్. అనసూయ కనిపించేది కాసేపే అయినా ఆమె పాత్ర గుర్తుండిపోతుంది.
సాంకేతిక విషయాలు: ఈ సినిమాకి కుశెంధర్ రమేష్ రెడ్డి సినీ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి హైలెట్ అని చెప్పాలి అలాగే బీమ్స్ సిసిరోలియో సంగీతం కూడా ఈ సినిమాని ఒక మెట్టు పైన నిలబెట్టింది. అలాగే తమ్మి రాజు ఎడిటింగ్ కూడా సినిమాకి ప్లస్ పాయింట్.