November 30, 2021
తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో అద్భుతమైన పాటలను అందించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి న్యూమోనియాతో ఈ నెల 24 హైదరాబాద్లోని కీమ్స్ ఆసుపత్రిలో చేరారు. ఆయనను నిపుణులైన వైద్య బృందం ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
టాలీవుడ్ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి న్యూమోనియాతో బాధపడుతూ నవంబరు 24న ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఎప్పటిప్పుడు పరిశీలిస్తున్నారు. ఐసీయూలో ఉన్న సీతారామశాస్త్రి త్వరగా కోలుకునేందుకు అవసరమైన చికిత్సను అందిస్తున్నారు. సిరివెన్నెల ఆరోగ్యం పరిస్థితికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తాం’ అని కిమ్స్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.
తాజాగా సిరివెన్నెల ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులకు వైద్యులు వెల్లడిస్తున్నట్లు సమాచారం.
1986లో విడుదలైన ‘సిరివెన్నెల’ చిత్రంతో గేయ రచయితగా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు సీతారామశాస్త్రి. మొదటి సినిమానే అతని ఇంటి పేరుగా మార్చుకొని సిరివెన్నల సీతారామశాస్త్రిగా పేరుగాంచారు. అంతేకాదు ఆ సినిమాకు గాను ఉత్తమ గేయ రచయితగా అవార్డుని అందుకున్నారు. 2019లో భారతదేశ పురస్కారం పద్మశ్రీ లభించింది. స్వర్ణ కమలం, గాయం, శుభలగ్నం, సింధూరం, చక్రం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి ఎన్నో సినిమాల్లోని పాటలకు గాను సిరివెన్నెల నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. మూడున్నర దశాబ్దాలుగా ఆయన ఎన్నో వేల పాటలను రాశారు. తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీలోని ‘దోస్తీ’ పాట లిరిక్స్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. సీతారామశాస్త్రి త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులతో పాటు అభిమానులు కోరుకుంటున్నారు.