August 24, 2022
మహేశ్బాబు హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన పోకిరి సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. మహేశ్ కెరీర్ను ఈ సినిమా నెక్ట్స్ లెవల్కు తీసుకుని వెళ్లడమే కాకుండా, ఇండస్ట్రీహిట్గా నిలిచింది పోకిరి. 2006లో విడుదలైన ఈ సినిమా క్రేజ్ ఇంకా తెలుగు ఇండస్ట్రీలో కొనసాగుతూనేఉంది. ఆగస్టు 9న అంటే మహేశ్బాబు బర్త్ డే సందర్భంగా పోకిరి సినిమా స్పెషల్ షోలు వేస్తే వచ్చిన కలెక్షన్స్ పోకిరి సినిమాకు ఉన్న క్రేజ్ను చెప్పకనే చెబుతున్నాయి.
అయితే పోకిరి సినిమాకు సీక్వెల్ చేసే ఆలోచన ఉందన్నట్లుగా పేర్కొన్నారు ఈ చిత్రం దర్శకుడు పూరీ జగన్నాథ్. కానీ ఈ ఆలోచనలు ఇప్పటివి కాదట. 2010లో అనుకున్నారట పూరీ. అలాగే మహేశ్బాబు, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన బిజినెస్మేన్ (2012) సినిమాను హిందీలో మహేశ్బాబుతోనే చేయాలనుకున్నారు పూరీ. కానీ కుదర్లేదు. ఈ విషయాలను స్వయంగా పూరీయే చెప్పారు. విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ‘లైగర్’ సినిమా ఆగస్టు 25న విడుదల అవుతుంది. ఈ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న పూరీ ఈ విషయాలను ఓ ముంబై మీడియా వెబ్సైట్లో చెప్పారు.
మరోవైపు ప్రస్తుతం మహేశ్బాబుకు, పూరీ జగన్నాథ్కు ఏ మాత్రం సఖ్యత లేదు. పూరీ ప్లాఫ్స్లో ఉన్నప్పుడు ఓ సారి మహేశ్కు కథ చెప్పాలని ప్రయత్నించాడు పూరీ. కానీ మహేశ్ టైమ్ ఇవ్వలేదు. దీంతో పూరీ జగన్నాధ్ నొచ్చుకున్నారు. సక్సెస్ ఉంటేనే మహేష్ మాట్లాడుతాడు అని బహిరంగంగానే చాలా సార్లు చెప్పారు కూడా..ఈ కారణం వల్లే తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘జనగణమన’ను విజయ్ దేవరకొండతో చేస్తున్నారు పూరి. నిజానికి ఈ సినిమాను మహేశ్బాబుతో అనుకున్నట్లుగా పూరీ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిన విషయం గుర్తుండే ఉంటుంది.