August 23, 2022
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఇటీవల ‘ఆచార్య’ (Acharya) సినిమాతో ఘోర పరాజయాన్ని చవిచూశాడు. చిరంజీవి, రామ్ చరణ్ (Ram Charan)లు తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన సినిమా అయినప్పటికీ అర్ధపర్ధం లేని కథ కారణంగా డిజాస్టర్ టాక్ ను మూటగట్టుకుంది. అయితే ఈ సినిమా అమేజాన్ ప్రైమ్లో మాత్రం బాగానే రన్అవుతుంది. ఆ విషయం అటుంచితే ప్రస్తుతం చిరంజీవి భోళా శంకర్, గాడ్ఫాదర్ షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాల తర్వాత బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ తన 154వ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ సినిమాకు వాల్తేరు వీరయ్య అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ మూవీలో చిరంజీవి తమ్ముడిగా రవితేజ ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్గా ఎంపికైంది. అయితే రవితేజకు హీరోయిన్గా కేథరిన్ థ్రెసా ని అనుకున్నారు. అయితే తాజాగా కేథరిన్ ఈ ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చేసింది. రీసెంట్ గా కేథరిన్ నటించిన బింబిసార కళ్యాణ్ రామ్ కెరీర్లోనే పెద్ద హిట్ అయ్యింది. దాంతో ఈ అమ్మడు రెమ్యునరేషన్ భారీగా పెంచేసిందట. దాంతో పాటు కాల్షిట్ సమస్యల కారణంగా ఈ సినిమాలో రవితేజకు వేరే హీరోయిన్ను చూసే పనిలో ఉన్నారట చిత్ర యూనిట్.
అన్ని కమర్షియల్ హంగులతో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. చిరంజీవి సినిమాలో మత్స్య కారుడిగానే కాకుండా.. మత్స్య కారులకు నాయకుడిగా కనిపించనున్నారట. తమ జీవితాలపై పెత్తనం, తమ మార్కెట్ పై ఆధిపత్యాన్ని ప్రశ్నించే నాయకుడిగా చిరంజీవి కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది.